Galla Jayadev: ఏపీ రాజధానిగా 'అమరావతి'.. భారతదేశ మ్యాపును అప్డేట్ చేసిన సర్వే ఆఫ్ ఇండియా
![Political Maps of India have been updated to show Amaravati as Capital](https://imgd.ap7am.com/thumbnail/cr-tn-6ead78e8e56a.jpg)
- గల్లా జయదేవ్కు సర్వే ఆఫ్ ఇండియా లేఖ
- ఉన్నత అధికారుల ఆమోదంతో లేఖ విడుదల
- గల్లా జయదేవ్ హర్షం
- పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తానని వ్యాఖ్య
భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చేర్చామని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం తెలిపింది. ఈ మేరకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కు సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్సింగ్ లేఖ రాశారు. ఉన్నతాధికారుల ఆమోదంతో ఈ లేఖను విడుదల చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
దీనిపై ఎంపీ గల్లా జయదేవ్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. భారత మ్యాపులో ఏపీ రాజధాని అమరావతి అన్న అంశాన్ని పేర్కొనలేదన్న విషయాన్ని తాను 2019 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో లేవనెత్తానని చెప్పారు. దీంతో సర్వే ఆఫ్ ఇండియా ఈ అంశాన్ని పరిశీలించి తాజాగా ప్రకటన చేసిందని, ఏపీ రాజధానిగా అమరావతి పేరును పేర్కొంటూ మ్యాపును అప్ డేట్ చేసిందని ట్వీట్ చేశారు.