New York: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో తొలిసారిగా భారత జెండా ఆవిష్కరణ

Indian Flag Hoisted at Newyork Time Square First Time

  • పతాకావిష్కరణ చేసిన రణధీర్ జైస్వాల్
  • రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
  • 200 మందికిపైగా పవాస భారతీయుల హాజరు

న్యూయార్క్ లోని ప్రతిష్ఠాత్మక టైమ్ స్క్వేర్ లో భారత త్రివర్ణపతాకం రెపరెపలాడింది. శనివారం ఉదయం ఇక్కడ తొలిసారిగా పతాకావిష్కరణ జరిగింది. దాదాపు 200 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని నినాదాలు చేశారు. న్యూయార్క్ లో కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్న రణధీర్ జైస్వాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి, జెండాను ఎగురవేశారు. "74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం మేమంతా కలిశాం. ఇక్కడ భారత జెండాను ఎగురవేసే అవకాశం రావడం ఎంతో గర్వకారణం అనిపించింది. ఇండియన్స్ న్యూయార్క్ లో చరిత్ర సృష్టించారు" అని కార్యక్రమంలో పాల్గొన్న వారు వ్యాఖ్యానించారు.

"జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం ఎంతో గర్వకారణంగా అనిపించింది. టైమ్ స్క్వేర్ వంటి ఎంతో చరిత్ర ఉన్న ప్రాంతంలో ఈ కార్యక్రమం జరగడం సంతోషాన్నిచ్చింది" అని రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ (ఎఫ్ఐఏ) ఆధ్వర్యంలో జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువ మంది అతిథులు హాజరు కాలేదని, భౌతిక దూరాన్ని పాటిస్తూ, కార్యక్రమం నిర్వహించామని ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు అలోక్ కుమార్ వెల్లడించారు. ఇరు దేశాల చరిత్రలో ఈ ఘటన ఓ సరికొత్త అధ్యాయమని ఆయన అభివర్ణించారు. ఇదే సమయంలో ఎంపైర్ స్టేట్ భవంతి వద్ద కూడా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.

  • Loading...

More Telugu News