Telangana: తెలంగాణలో కరోనా తగ్గుముఖం... టెస్టుల సంఖ్య పెరుగుతుంటే పడిపోయిన టీపీఆర్!

Test Positive Report Down in Telangana

  • 22 నుంచి 16 శాతానికి తగ్గిన టీపీఆర్
  • క్రమంగా పెరుగుతున్న యాంటీజెన్ టెస్టులు
  • వైరస్ కట్టడి చర్యలు సమర్థవంతం

తెలంగాణలో కరోనా వైరస్ టెస్టుల సంఖ్య తక్కువగా ఉందని వస్తున్న విమర్శలకు చెక్ పడింది. టెస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచగా, పాజిటివ్ వస్తున్న కేసుల గణాంకాలు గణనీయంగా పడిపోయాయి. రాష్ట్రంలో టెస్ట్ పాజిటివ్ రేట్ (టీపీఆర్) తగ్గిందని తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ నెల 9వ తేదీన పరీక్షించిన నమూనాల్లో నూటికి 21.98 శాతం పాజిటివ్ రాగా, ఆపై రెండు వారాల వ్యవధిలోనే ఈ శాతం 16.75కు పడిపోయింది. 

దీంతో రెండు వారాల క్రితం వరకూ టీపీఆర్ విషయంలో ఆందోళన కలిగించిన రాష్ట్రంలోని పరిస్థితులు ఇప్పుడు కాస్తంత కుదుటబడ్డట్లయింది. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను ప్రభుత్వం క్రమంగా పెంచుతూ ఉండటమే ఇందుకు కారణం. ఇదిలావుండగా, ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టుల్లో నెగటివ్ వచ్చి, ఆపై నమూనాలను ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ కు పంపుతున్న గణాంకాలను మాత్రం రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేయడం లేదు. 

జూన్ మూడవ వారం వరకూ రాష్ట్రంలో టెస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉందన్న విమర్శలు రాగా, ఆపై క్రమంగా నమూనాల సేకరణ, పరీక్షలు పెరుగుతూ వచ్చాయి. జూన్ నెలాఖరు నాటికి 18.4 శాతంగా ఉన్న టీపీఆర్, ఆపై మరింతగా పెరిగింది. దీంతో అధికారులు ఆందోళనకు గురైనప్పటికీ, కట్టడి చర్యలను సమర్థవంతంగా చేపట్టారు. ఫలితంగా టీపీఆర్ తగ్గుతూ వచ్చింది.

  • Loading...

More Telugu News