Corona Virus: ప్లాస్మా దానం చేసిన ఆప్ ఎమ్మెల్యే అతిషి.. అభినందించిన కేజ్రీవాల్

AAP MLA Atishi donates plasma

  • ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న అతిషి
  • కోలుకున్న వారు తనలానే ప్లాస్మా దానానికి ముందుకు రావాలని పిలుపు
  • ప్లాస్మాతో కరోనా రోగులకు చికిత్స

ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న ఢిల్లీలోని అధికార పార్టీ ఎమ్మెల్యే అతిషి నిన్న ప్లాస్మా దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్)లో దేశంలోనే తొలిసారి ‘ప్లాస్మా బ్యాంకు’ను ఏర్పాటు చేసింది. అతిషి ఇక్కడే తన ప్లాస్మాను దానం చేశారు.

అంతకుముందు ఆమెకు అన్ని రకాల పరీక్షలు చేయడంతో పాటు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. సాధారణంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. ఇవి వైరస్‌తో సమర్థవంతంగా పోరాడతాయి. ఒక్కొక్కరు 250 నుంచి 500 మిల్లీలీటర్ల ప్లాస్మాను దానం చేయొచ్చు. వీటిని కరోనా రోగుల శరీరంలోకి పంపిస్తే వారు కోలుకునేందుకు అవకాశాలు మెరుగవుతాయి.

కాగా, తాను ప్లాస్మాను డొనేట్ చేసిన విషయాన్ని అతిషి ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేకాదు, తనలానే కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేసిన అతిషిని ముఖ్యమంత్రి అరవింద్  కేజ్రీవాల్ అభినందించారు.

Corona Virus
New Delhi
AAP
Plasma
  • Loading...

More Telugu News