Aadhar: శరవేగంగా సిద్ధమవుతున్న రైతుల 'ఆధార్' ఆధారిత డేటాబేస్!

Aadhar Based Detabase of Farmers

  • తొలి దశలో 9 రాష్ట్రాలకు చెందిన 5 కోట్ల రైతుల వివరాలు
  • డేటా బేస్ లో వారి పొలాల శాటిలైట్ ఇమేజ్ లు కూడా
  • బ్యాంకులు, టెక్నాలజీ కంపెనీలకు వివరాలు అందిస్తాం
  • వెల్లడించిన వివేక్ అగర్వాల్

రైతుల ఖాతాల్లోకి అన్ని రకాల స్కీముల ప్రయోజనాల తాలూకు డబ్బును నేరుగా ట్రాన్స్ ఫర్ చేయాలన్న ఆలోచనలో ఉన్న కేంద్రం, ఆధార్ ఆధారిత డేటాబేస్ ను శరవేగంగా సిద్ధం చేస్తోంది. తొలి దశలో 9 రాష్ట్రాలకు చెందిన 5 కోట్ల మంది రైతుల వివరాలను తయారు చేసి, వారి భూమి తదితర వివరాలను డిజిటలైజ్ చేయనున్నామని కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన డిజిటల్ అగ్రికల్చర్ డివిజన్ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకే చేరుతుందని ఆయన అన్నారు.

"ఈ డేటాబేస్ ను జూన్ 30లోగా పూర్తి చేస్తాం. ప్రతి రైతు భూమికి సంబంధించిన శాటిలైట్ ఇమేజ్ లు ఇందులో ఉంటాయి. వారికున్న భూమిని బట్టి,ఏం పంటలు వేయాలన్న సలహా సూచనలు అందిస్తాం. పంట పెరిగే విధానాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటాం" అని వివేక్ అగర్వాల్ తెలిపారు. కాగా, పీఎం-కిసాన్ స్కీమ్ కు కూడా వివేక్ సీఈఓగా కొనసాగుతున్నారు.

ఈ డేటాబేస్ ను వ్యవసాయ సాంకేతిక కంపెనీలతో పంచుకుంటామని, తద్వారా వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేసి దిగుబడిని పెంచేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బును జమ చేసేందుకు కూడా ఈ డేటాబేస్ ఉపయోగపడుతుందని అన్నారు. ప్రభుత్వం కూడా కనీస మద్దతు ధరను ఆధార్ డేటాబేస్ ఆధారంగానే జమ చేస్తుందని అన్నారు. వ్యవసాయ రంగంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించడమే ప్రభుత్వ లక్ష్యమని వివేక్ అగర్వాల్ తెలిపారు.

Aadhar
Farmers
Detabase
Vivek Agarwal
  • Loading...

More Telugu News