KCR: హైదరాబాద్ వర్సిటీకీ పీవీ పేరు పెట్టాలంటూ ప్రధానికి లేఖ రాసిన సీఎం కేసీఆర్

CM KCR writes PM Modi

  • ఇవాళ పీవీ నరసింహారావు జయంతి
  • ఏడాది పాటు వేడుకలకు తెరదీసిన తెలంగాణ సర్కారు
  • వర్సిటీకీ పీవీ పేరు పెట్టాలని డిమాండ్లు వస్తున్నాయన్న కేసీఆర్

ఇవాళ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వేడుకలకు తెరలేపింది. ఈ వేడుకలు ఏడాది పాటు జరుగుతాయని అంటోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తమ గడ్డపై పుట్టి దేశాన్ని ఏలిన స్థితప్రజ్ఞుడు పీవీ నరసింహారావుకు సముచిత గౌరవం కల్పించాలని సంకల్పించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు పేరు పెట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

అత్యంత దయనీయ పరిస్థితుల్లో దేశం ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, ఆర్థిక అభ్యున్నతి దిశగా బాటలు వేసిన దార్శనికుడు పీవీ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో ఆయనొక బహుముఖ ప్రజ్ఞావంతుడని కొనియాడారు. రాష్ట్రస్థాయిలో గురుకుల పాఠశాలలు, జాతీయస్థాయిలో నవోదయ విద్యా కేంద్రాల ఏర్పాటుకు ఆద్యుడు పీవీనే అని సీఎం కేసీఆర్ వివరించారు. దేశంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు పీవీ తీసుకున్న చర్యలు విప్లవాత్మకమైనవని కీర్తించారు.

అలాంటి మహనీయుడి పేరిట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని శ్రీ పీవీ నరసింహారావు కేంద్రీయ విశ్వవిద్యాలయం అని నామకరణం చేయాలని తెలంగాణ వ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు.  కేంద్రం దీనిపై సానుకూలంగా స్పందిస్తే ఆ సర్వోన్నతుడి శతజయంతి సందర్భంగా సరైన నివాళి అర్పించినట్టు అవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

KCR
Narendra Modi
Letter
PV Narasimharao
HCU
Birth Anniversary
  • Loading...

More Telugu News