Andhra Pradesh: మూడోసారి... హైకోర్టు విచారణకు హాజరైన ఏపీ డీజీపీ

AP DGP attends High Court hearing

  • ఇప్పటికే రెండు సార్లు హైకోర్టుకు హాజరైన డీజీపీ
  • మద్యం రవాణా కేసుల్లో సీజ్ చేసిన వాహనాల కేసులో మూడోసారి హాజరు
  • వాహనాలపై మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మరోసారి హైకోర్టు మెట్లెక్కారు. ఇప్పటికే రెండు సార్లు హైకోర్టు విచారణకు హాజరైన డీజీపీ... ఈరోజు మూడోసారి హైకోర్టుకు వచ్చారు. అక్రమ మద్యం రవాణా కేసులో సీజ్ చేసిన వాహనాలను యజమానులకు అప్పగించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. అయితే న్యాయవాది వాదనలతో సంతృప్తి చెందని న్యాయస్థానం... కోర్టుకు రావాలంటూ డీజీపీని ఆదేశించింది. దీంతో, ఈరోజు ఆయన హైకోర్టుకు వచ్చారు.

విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ... అక్రమ మద్యం కేసులో పోలీసు అధికారులు నిబంధనలను పాటించలేదని అన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కొందరు పోలీసు అధికారుల పని తీరు సరిగా లేదని వ్యాఖ్యానించింది. వాహనాల అప్పగింత జాప్యతపై డీజీపీని వివరణ అడగాలని ఏజీని తాము ఆదేశించామని... అయితే, ఎక్సైజ్ ఏజీపీతో మెమో ఫైల్ చేయించారని వ్యాఖ్యానించింది. మీ న్యాయ సలహా విభాగం సరిగా పని చేయడం లేదని డీజీపీని ఉద్దేశించి న్యాయమూర్తి అన్నారు. ఈ కారణం వల్లే మిమ్మల్ని కోర్టుకు పిలిపించాల్సి వచ్చిందని చెప్పారు.

మూడు రోజుల్లోగా సీజ్ చేసిన వాహనాలను డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. మూడు రోజుల్లోగా సీజ్ చేసిన వాహనాలపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

పిటిషన్ వివరాల్లోకి వెళ్తే, నిబంధనలకు లోబడి మద్యం తీసుకెళ్తున్నప్పటికీ... వాహనాలను జప్తు చేస్తున్నారని పిటిషన్ దాఖలైంది. వాటిని విడుదల చేసేలా పోలీసులకు ఆదేశాలను జారీ చేయాలని పిటిషన్ లో విన్నవించారు.

  • Loading...

More Telugu News