Corona Virus: పరిస్థితి చెయ్యి దాటుతోంది: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

Corona Pandemic Situation is Worsening

  • కేసులు మరింతగా పెరుగుతున్నాయి
  • ఎంతమాత్రమూ నిర్లక్ష్యం వద్దు
  • యూఎస్ లో పౌర నిరసనలతో మరింత వ్యాప్తి
  • డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టీడ్రాస్ అడ్హనామ్

కరోనా వైరస్ పై ఎంతమాత్రమూ నిర్లక్ష్యం వద్దని, ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి తీవ్రత మరింతగా పెరుగుతూ, చెయ్యి దాటి పోతోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య అమెరికాతో పాటు పలు దేశాల్లో గరిష్ఠానికి చేరిందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టీడ్రాస్ అడ్హనామ్ జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అమెరికాలో జరుగుతున్న మూకుమ్మడి పౌర నిరసనల కారణంగా వైరస్ వ్యాప్తి మరింతగా పెరుగుతోందని ఆయన అన్నారు.

చైనాలో గత డిసెంబర్ లో వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత 70 లక్షల మంది వ్యాధి బారిన పడగా, ఇప్పటికే నాలుగు లక్షల మందికి పైగా చనిపోయిన సంగతి తెలిసిందే. తూర్పు ఆసియా తరువాత, యూరప్ లో ఈ మహమ్మారి హాట్ సెంటర్లు ఏర్పాటు అయ్యాయి. దాన్ని అమెరికా ఇప్పుడు అధిగమించింది.

"యూరప్ లో పరిస్థితి మెరుగు పడుతోంది. కానీ, ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే మాత్రం వైరస్ తీవ్రమవుతోంది. గత 9 రోజుల్లో రోజుకు లక్ష కేసులకు పైగా రాగా, నిన్న ఏకంగా 1.36 లక్షల కొత్త కేసులు వచ్చాయి. ఒక రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం" అని ఆయన అన్నారు. ఈ కొత్త కేసుల్లో 75 శాతానికి పైగా కేసులు అమెరికన్, సౌత్ ఆసియా దేశాలకు చెందినవే కావడం గమనార్హం.

ఇక కొత్త కేసుల సంఖ్యను తగ్గించిన దేశాల్లో నిర్లక్ష్యం ఏ మాత్రమూ తగదని, ప్రపంచం ఇంకా మహమ్మారి నుంచి పూర్తిగా బయట పడలేదని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. ఇప్పటికే వైరస్ వచ్చి ఆరు నెలలు దాటిందని, అయినప్పటికీ ఏ దేశమూ కూడా ఆంక్షలు, వైరస్ కట్టడి విషయంలో అలక్ష్యం చేయవద్దని టీడ్రాస్ సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News