Centre: విదేశాల నుంచి వచ్చేవారికి చార్జీలు నిర్ణయించిన కేంద్రం
![Centre plans to evacuate Indians from abroad on payment basis](https://imgd.ap7am.com/thumbnail/tn-4a6cecdcd913.jpg)
- కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు
- మే 7నుంచి 64 విమానాల్లో తరలింపు
- లండన్ నుంచి ఢిల్లీకి ఒక్కొక్కరికి రూ.50 వేలు
కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది. భారతీయులు పెద్ద సంఖ్యలో విదేశాల్లో చిక్కుకుపోయారు. అలాంటివారిని భారత్ కు తీసుకువచ్చేందుకు కేంద్రం భారీ కార్యాచరణ రూపొందించింది. విదేశాల్లో ఉంటున్న భారతీయుల కోసం మే 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 64 ప్రత్యేక విమానాలు నడపనుంది.
ఇతర దేశాల్లో ఉన్న వేల మంది భారతీయులను దశల వారీగా తరలిస్తారు. అయితే, భారత్ కు రావాలనుకుంటున్న పౌరుల నుంచి రుసుం వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. లండన్ నుంచి ఢిల్లీ వచ్చే విమానంలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.50 వేలు, ఢాకా నుంచి ఢిల్లీ వచ్చేందుకు రూ.12 వేలు వసూలు చేయాలని నిర్ణయించారు. తొలి విడతలో భాగంగా అమెరికా, గల్ఫ్ దేశాలు, మలేసియా, యూకే, సింగపూర్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ లకు విమానాలు నడపనున్నారు. మొత్తం 14,800 మందిని భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-8047a55f5d9467c93780e4df55a2577f2c7611f7.jpeg)