India: భారత్‌లో 1,000 దాటిన కరోనా మృతులు.. భారీగా పెరిగిపోతోన్న కేసులు

Indias COVID19 tally reaches 31332 death toll at 1007

  • గత 24 గంటల్లో భారత్‌లో 73 మంది మృతి
  • కరోనా కేసుల సంఖ్య  మొత్తం 31,332
  • కరోనా నుంచి కోలుకున్న 7,695 మంది
  • ఆసుపత్రుల్లో 22,629 మందికి చికిత్స

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా మృతుల సంఖ్య వెయ్యి దాటింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... గత 24 గంటల్లో భారత్‌లో 73 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,007కి చేరింది. దేశంలో 24 గంటల్లో 1897 మందికి కొత్తగా కరోనా సోకింది.

కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 31,332కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 7,695 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 22,629 మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసుల సంఖ్య 9,318కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 400 మంది మృతి చెందారు. 1,388 మంది కోలుకున్నారు.

గుజరాత్‌లో 3,744 మందికి కరోనా సోకగా 181 మంది మృతి చెందారు. 434 మంది కోలుకున్నారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 3,314కి చేరింది. 1,078 మంది కోలుకోగా, 54 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లో 2,387 కేసులు నమోదు కాగా, 377 మంది కోలుకున్నారు. 120 మంది ప్రాణాలు కోల్పోయారు.

గోవాలో ఏడుగురికి కరోనా సోకగా వారంతా కోలుకున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఒకరికి సోకగా ఆ వ్యక్తి కోలుకున్నారు. మణిపూర్‌లో ఇద్దరికి సోకగా వారు కోలుకున్నారు. త్రిపురలో ఇద్దరికి కరోనా సోకగా వారిద్దరు డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినప్పటికీ కేసులు పెరిగిపోతున్నాయి.

  • Loading...

More Telugu News