Corona Virus: దేశంలో మరిన్ని పెరిగిన కరోనా కేసులు.. ఇప్పటివరకు 377 మంది మృతి

coronavirus cases in india

  • 24 గంటల్లో 1,076 కొత్త కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,439
  • దేశంలో 24 గంటల్లో మరో 38 మంది మృతి
  • మహారాష్ట్రలో 2,687 మందికి కరోనా

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 9,756 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. 1,305 మంది కోలుకోగా, 377 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. దేశంలో 24 గంటల్లో 1,076 కొత్త కేసులు నమోదయ్యాయని ప్రకటన చేసింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,439 కి చేరింది.                                          దేశంలో 24 గంటల్లో మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య 377కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరించింది. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయని తెలిపింది. ఆ రాష్ట్రంలో మొత్తం 2,687 మందికి కరోనా సోకిందని పేర్కొంది. వారిలో 259 మంది కోలుకోగా, 178 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.

మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,561 మందికి కరోనా సోకగా, వారిలో ఇప్పటివరకు 30 మంది కోలుకున్నారు. మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రెండు రాష్ట్రాల తర్వాత తమిళనాడులో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో 1,204 కేసులు నమోదు కాగా, 81 మంది కోలుకున్నారు. 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాజస్థాన్‌లోనూ కరోనా కేసులు 1,000కి చేరువయ్యాయి. ఇప్పటివరకు 969 మందికి కరోనా సోకగా, 147 మంది కోలుకున్నారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో 730 కేసులు నమోదు కాగా, 51 మంది కోలుకున్నారు. 50 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News