Telangana: తెలంగాణలో పెరుగుతూనే ఉన్న కోవిడ్ కేసులు.. నిన్న ఒక్క రోజే 52 మందికి సోకిన మహమ్మారి

Covid cases continue to rise in Telangana

  • హైదరాబాద్‌లో వెలుగులోకి 40 కేసులు
  • వైరస్‌తో పోరాడి మృతి చెందిన హైదరాబాదీ
  • ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 110

తెలంగాణలో కరోనా కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రతీ రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సోమవారం 61 కేసులు వెలుగు చూడగా, నిన్న 52 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తంగా 644 మంది బాధితులుగా మారారు. చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలుపుకుని మొత్తం 110 మంది కోలుకుని ఆరోగ్యవంతులుగా ఇళ్లకు వెళ్లారు.

హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి నిన్న ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి మృతి చెందాడు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 18కి పెరిగింది. నిన్న నమోదైన కేసుల్లో 40 హైదరాబాద్‌లోనే నమోదు కావడం నగర వాసులను భయపెడుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ సంక్రమించిన వారి కుటుంబ సభ్యులకే పరీక్షలు చేస్తున్న అధికారులు ఇప్పుడు బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిలో వైరస్ లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News