Pratheesh Narayan: ఆండ్రాయిడ్, వాట్సాప్ లో లోపాలు పట్టేస్తూ లక్షలు సంపాదిస్తున్న కేరళ కుర్రాడు

Kerala student finds bugs and bags cash

  • ఇటీవలే ఆండ్రాయిడ్ లో బగ్ గుర్తించిన ప్రతీష్ నారాయణ్
  • రూ.7.6 లక్షల నజరానా ఇచ్చిన గూగుల్
  • ఇప్పటివరకు 13 బగ్ లు గుర్తింపు

ఆండ్రాయిడ్, వాట్సాప్ వంటి వేదికల్లో లోపాలను గుర్తించడమే ఉపాధిగా మలుచుకున్నాడో కేరళ యువకుడు. అతడి పేరు ప్రతీష్ నారాయణ్. ప్రస్తుతం బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఎర్నాకుళంకు చెందిన ప్రతీష్ ఇటీవలే గూగుల్ కు చెందిన ఆండ్రాయిడ్ ఓఎస్ లో ఓ బగ్ ను గుర్తించి రూ.7.6 లక్షల నజరానా అందుకున్నాడు. ఆ బగ్ ను గూగుల్ కొన్నిరోజుల క్రితమే ఫిక్స్ చేసింది. ప్రపంచంలో ఏదో ఒక మూలన ఉన్న హ్యాకర్ కాంటాక్ట్ కార్డు సాయంతో ఆండ్రాయిడ్ ఫోన్లను ఎప్పటికీ పనిచేయకుండా నాశనం చేయగలడని ప్రతీష్ సోదాహరణంగా చూపించాడు.

తాను గుర్తించిన CVE-2019-2232 బగ్ హ్యాకర్లకు అవకాశమిచ్చేలా ఉందని, దీన్ని తాను గూగుల్ దృష్టికి తీసుకెళ్లానని ప్రతీష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. "ఈ బగ్ ఎవరి ఫోన్లనైనా క్రాష్ చేయగలదు. కీబోర్డుపై యాదృచ్చికంగా కొన్ని బటన్లను నొక్కితే అర్థం పర్థంలేని అక్షరాలు ఎలా వస్తాయో ఈ కాంటాక్టు కార్డు కూడా అలాగే పొందికలేని అక్షరాలతో కూడి ఉంటుంది. అయితే దీన్ని ఫోన్ లోని ఆపరేటింగ్ సిస్టమ్ గుర్తించడంలో విఫలమవడమే కాదు, ఏకంగా ఫోనే క్రాష్ అవుతుంది. ఎందుకంటే ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నిర్దిష్ట పరిమితి గల మెమరీ మాత్రమే ఉంటుంది. ఆ పరిమితి దాటితే సిస్టమ్ తట్టుకోలేదు" అని వివరించాడు.  

ఈ బగ్ ను తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతీష్ కు గూగుల్ రూ.10 వేల డాలర్ల రివార్డు అందించింది. ప్రతీష్ ఇలాంటి నజరానాలు అందుకోవడం ఇదే ప్రథమం కాదు. మొత్తం 13 బగ్ లు కనుగొన్నాడు. ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్ లో అత్యధికంగా 9 లోపాలు, గూగుల్ లో 3, మైక్రోసాఫ్ గిట్ హబ్ లో ఒక లోపం గుర్తించాడు. భవిష్యత్ లోనూ దీన్నే ఉపాధిగా మలుచుకుంటానని ప్రతీష్ చెబుతున్నాడు.

Pratheesh Narayan
Bug
Whatsapp
Google
Android
Facebook
  • Loading...

More Telugu News