America: న్యూయార్క్‌లో దయనీయం.. కోవిడ్ మృతులకు సామూహిక ఖననాలు!

 Massive burials in New York

  • ప్రతి రోజూ అమెరికాలో వేలల్లో మరణాలు
  • ప్రపంచ దేశాలను మించిపోయిన న్యూయార్క్
  • మృతదేహాలను తీసుకెళ్లేందుకు ముందుకు రాని వైనం

కోవిడ్-19 విసిరిన పంజాకు అమెరికా విలవిల్లాడుతోంది. ఆ దేశంలో ప్రతి రోజు వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం 1973 మంది కరోనా కాటుకు బలవగా, గురువారం 1783 మంది ప్రాణాలు విడిచారు. నిన్న రాత్రి 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 1309 మంది చనిపోయారు. 


ఫలితంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య అమెరికాలో 18 వేలు దాటింది. 4.8 లక్షల కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్‌లో మరింత దారుణ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ నిన్న ఒక్క రోజే 777 మంది మృతి చెందారు. దీంతో ఒక్క న్యూయార్క్‌లోనే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,800 దాటిపోయింది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నమోదైన మరణాల కంటే ఒక్క న్యూయార్క్‌లోని మరణాల సంఖ్యే ఎక్కువ కావడం గమనార్హం. కేసుల సంఖ్య కూడా న్యూయార్క్‌లోనే అధికం. 


కరోనాకు బలైన వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అధికారులే సామూహిక ఖననాలు జరిపిస్తున్నారు. స్థానికంగా ఉన్న హార్ట్ దీవిలో తవ్విన భారీ గుంతలో శవాలను పూడ్చిపెడుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

America
New York
Corona Virus
COVID-19 deaths
  • Loading...

More Telugu News