Andhra bank: ఆంధ్రాబ్యాంకు... ఇక ముగిసిన అధ్యాయం!

andhra bank merged in union bank

  • నేటి నుంచి యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం
  • ఇన్నాళ్లు ఆంధ్రులకు గుర్తింపుగా ఓ లోగో
  • ఉద్యోగుల వ్యతిరేకతను పట్టించుకోని ప్రభుత్వం

బ్యాంకింగ్‌ రంగంలో తెలుగువారికో గుర్తింపు, గౌరవం అన్నట్లు ఇన్నాళ్లు కొనసాగిన ఆంధ్రాబాంక్‌ అధ్యాయం ఇక ముగిసినట్టే. 97 ఏళ్లుగా సేవలందిస్తున్న ఈ ఆర్థిక రంగ సంస్ధ నేడు కనుమరుగయింది. బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాబ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంకులను యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రావడంతో ఇకపై ఆంధ్రాబ్యాంక్‌ లోగోకు బదులు యూనియన్‌ బ్యాంకు లోగో లేదా కొత్త లోగో దర్శనమిస్తుంది.

 ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923 నవంబరులో ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారు. 1980 ఏప్రిల్‌లో జాతీయ బ్యాంకుగా అవతరించింది. 2019 మార్చి నాటికి 26 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2,885 శాఖలు, 3,798 ఏటీఎంలకు ఆంధ్రాబ్యాంకు విస్తరించింది. 1981లో దేశంలో తొలిసారిగా క్రెడిట్‌ కార్డుల వ్యాపారాన్ని ప్రారంభించింది ఆంధ్రాబ్యాంకే.

అంతటి చరిత్ర ఉన్న బ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ చాలారోజులపాటు ఉద్యోగులు ఆందోళనలు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తననుకున్నట్టే విలీన ప్రక్రియను పూర్తిచేసింది. అయితే లోగో మారినా బ్యాంక్‌ జోనల్‌ కార్యాలయాలు, లీడ్‌ బ్యాంకు కార్యాలయాలు యథావిధిగా అవే భవనాల్లో కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు.

Andhra bank
Union Bank
merging
  • Loading...

More Telugu News