Trivikram Srinivas: కరోనా కట్టడి కోసం రూ.20 లక్షల విరాళం ప్రకటించిన త్రివిక్రమ్

  • దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం 
  • తమవంతు సాయాన్ని అందజేస్తున్న ప్రముఖులు 
  • మరోసారి గొప్ప మనసును చాటుకున్న త్రివిక్రమ్
Trivikram Srinivas

త్రివిక్రమ్ ఏ సినిమా చేసినా అందులో మనసులకు హత్తుకుపోయే ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మనుషులు .. మనసులు .. బంధాల చుట్టూనే ఆయన కథలు తిరుగుతుంటాయి. మనసును గురించి .. అది స్పందించే తీరును గురించి తను సృష్టించిన పాత్రలతో మాట్లాడించడమే కాదు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తను సైతం వెంటనే స్పందించిన సందర్భాలు వున్నాయి.

అలా ఆయన కరోనా విపత్తు విషయంపై కూడా స్పందించారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. మన దేశం కూడా కరోనా కారణంగా తీవ్రమైన ఆందోళన చెందుతోంది. కరోనా సహాయ చర్యల కోసం తమ వంతు సహాయాన్ని అందించడానికి ప్రముఖులంతా ముందుకు వస్తున్నారు. అలా త్రివిక్రమ్ కూడా ముందుకు వచ్చి తన వంతు సాయంగా, తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఇరు ప్రభుత్వాలకు ఈ విరాళాన్ని త్వరలోనే అందజేయనున్నట్టు వెల్లడించారు.

More Telugu News