Wasim Jaffer: ఆటకు బై చెప్పిన క్రికెటర్ వసీం జాఫర్!
![Wasim Jaffer announces retirement from all forms of the game](https://imgd.ap7am.com/thumbnail/tn-89c174fc3415.jpg)
- రిటైర్మెంట్ ప్రకటించిన ఫస్ట్ క్లాస్ దిగ్గజం వసీం జాఫర్
- అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటన
- రంజీ ట్రోఫీలో అనేక రికార్డులు నెలకొల్పిన జాఫర్
- భారత్ తరఫున 31 టెస్టుల్లో ప్రాతినిధ్యం
టీమిండియా మాజీ ఓపెనర్, దేశవాళీ దిగ్గజ ఆటగాడు వసీం జాఫర్ క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించాడు. దాదాపు 25 సంవత్సరాల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పరుగుల మోత మోగించిన 42 ఏళ్ల జాఫర్.. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు శనివారం తెలిపాడు.
భారత్ తరఫున 31 టెస్టులు ఆడిన జాఫర్ 1944 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 212. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 260 మ్యాచ్ లు ఆడిన అతను ఏకంగా 19,410 పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీలో 150 మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ గా నిలిచిన జాఫర్ ముంబైని రెండు సార్లు విజేతగా నిలిపాడు. అలాగే, గత మూడు సీజన్ల నుంచి విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించి రెండు టైటిళ్లు అందించాడు.