Visakhapatnam District: బామ్మా...బాగున్నావా అంటూ బురిడీ కొట్టించింది: మూడు తులాల బంగారంతో పరారు!

women cheats older women

  • గొలుసు తెగిపోయేట్టు ఉందంటూ బోల్తా 
  • తాడుతెచ్చిస్తే గట్టిగా కడతానని సూచన 
  • తాడు తెచ్చేలోగా పరారు

' బామ్మా...బాగున్నావా' అంటూ ఓ వృద్ధురాలిని బోల్తా కొట్టించి మూడు తులాల బంగారం గొలుసుతో పరారయ్యిందో ఆగంతుకురాలు. సొత్తు విలువ లక్షన్నర ఉంటుంది. మోసపోయానని అర్థమయ్యేలోగానే మహిళ మాయం కావడంతో లబోదిబోమంటూ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. విశాఖ జిల్లా మునగపాక మండల కేంద్రానికి చెందిన శరగడం రామసీత మధ్య వీధిలో ఉంటున్న తన కొడుకు వద్ద ఉంటోంది. కొడుకు, కోడలు పొలం పనులకు వెళ్లగా ఇంట్లో ఆమె ఒక్కతే ఉంది.

ఆమె మెడ, చెవులు, ముక్కుకు బంగారు ఆభరణాలున్నాయి. వృద్ధురాలు ఒంటరిగా ఉండడం గమనించిన ఆగంతుకురాలు నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో చొరవగా ఇంట్లోకి ప్రవేశించింది. పలానా వారి కోడలినని నమ్మబలికింది. మీ అమ్మాయి ఉంటున్న వద్దే మా ఇల్లు కూడా ఉందని చెప్పుకుంటూ తలుపు చాటున ఉండి చాలా సేపు యోగా క్షేమాలపై ఆరాతీసింది.

దీంతో కావాల్సిన మనిషేనని రామసీత నమ్మింది. వృద్ధురాలు తనను నమ్ముతోందని గ్రహించగానే మెడలో ఉన్న బంగారం గొలుసు విషయం ప్రస్తావించింది. అది తెగిపోయేలా ఉందని, తాడు తెస్తే గట్టిగా బిగించి కడతానని చెప్పింది. నిజమే అనుకున్న వృద్ధురాలు గొలుసు తీసి ఇచ్చి తాడు తెచ్చేందుకు మరో గది లోపలికి వెళ్లి వచ్చేలోగా పరారయ్యింది.

వెనక్కి వచ్చిన వృద్ధురాలు సదరు మహిళ కనిపించకపోవడంతో దొంగ దొంగ అంటూ కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చినప్పటికీ సదరు మహిళ కనిపించకుండా పోయింది. పలానా వారి కోడలినని చెప్పడంతో వారింటికి పరిగెత్తగా ఆ కుటుంబం అంతా పొలం పనిలో ఉన్నారని గుర్తించి మోసం జరిగిందన్న నిర్ధారణకు వచ్చారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Visakhapatnam District
munagapaka
Crime News
gold robery
  • Loading...

More Telugu News