Uttar Pradesh: మూడోసారీ ఆడపిల్లేనని అనుమానం.. భార్యను ముక్కలుగా నరికి చంపిన భర్త

  • భర్తను రాక్షసుడిగా మార్చిన అనుమానం
  • ముక్కలుగా నరికి పిండిమరలో వేసి ముద్దలు చేసిన వైనం
  • కుమార్తె చూడడంతో ఆలస్యంగా వెలుగులోకి

మూడోసారి గర్భవతి అయిన భార్య.. మళ్లీ ఆడపిల్లనే కంటుందన్న అనుమానం అతడిని రాక్షసుడిగా మార్చింది. గొంతు నులిమి చంపేసి ఆపై శరీరాన్ని ముక్కలు చేశాడు. అక్కడితోనూ ఆగక పిండిమరలో వేసి ముద్ద చేశాడు. ఆపై తగలబెట్టి బూడిద చేసి అడవిలో పడేశాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిని చంపడాన్ని చూసిన కుమార్తె అమ్మమ్మకు ఈ విషయం చెప్పడంతో విస్తుపోయిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలోని డీహ్‌కు చెందిన  రవీంద్రకుమార్‌(35)- ఊర్మిళ(27) భార్యాభర్తలు. 2011లో పెళ్లైన వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఊర్మిళ ఇటీవల గర్భం దాల్చింది. అయితే, ఈసారి కూడా ఆమె అమ్మాయికే జన్మనిస్తుందని అనుమానించిన భర్త రవీంద్రకుమార్ భార్యను హింసించడం మొదలుపెట్టాడు. దీంతో ఈ నెల 12న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఊర్మిళ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని రవీంద్రకుమార్ కుటుంబం అవమానంగా భావించింది. ఇదే విషయమై భార్యతో గొడవ పడిన రవీంద్ర కుమార్ ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత తండ్రి, సోదరులతో కలిసి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేశాడు. అనంతరం పిండిమరలో వేసి ముద్దచేశాడు. అక్కడితోనూ ఆగక కాల్చి బూడిద చేశాడు. ఆ తర్వాత మూటకట్టి అటవీ ప్రాంతంలో పడేశాడు. ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తల్లిని తన తండ్రి చంపడాన్ని కళ్లారా చూసిన పెద్ద కుమార్తె తన అమ్మమ్మకు విషయం చెప్పింది. ఆమె ద్వారా విషయం తెలుసుకున్న ఊర్మిళ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News