Tirupati: మాటువేసి.. కత్తులతో పొడిచి.. తిరుపతిలో రౌడీషీటర్ దారుణ హత్య

  • పాత కక్షలే కారణమని ప్రాథమిక నిర్దారణ
  • రెండేళ్ల క్రితం జరిగిన భార్గవ్ హత్యకేసులో బాధితుడు ప్రధాన నిందితుడు
  • భార్గవ్ అనుచరులే ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానం

తిరుపతిలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. కొర్లగుంట సుందరయ్యనగర్‌కు చెందిన పసుపులేటి మురళి అలియాస్ బెల్టు మురళి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గతరాత్రి స్నేహితులతో కలిసి తిరుమల బైపాస్ రోడ్డులోని ఓ ఫాస్ట్‌ఫుడ్ దుకాణానికి వెళ్లాడు. అనంతరం మద్యం తీసుకురావాలంటూ స్నేహితుడిని పంపి అక్కడే వేచి చూస్తున్నాడు.

అదే సమయంలో వెనక నుంచి వచ్చిన కొందరు దుండగులు మురళిపై దాడిచేసి కత్తులతో విచక్షణ రహితంగా పొడిచారు. ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో తల ఛిద్రమైంది. తీవ్ర గాయాలపాలైన మురళి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు మృతి చెందినట్టు నిర్ధారించుకున్న తర్వాత నిందితులు ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు పాత కక్షలే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. రెండేళ్ల క్రితం జరిగిన భార్గవ్ అనే యువకుడి హత్యకేసులో మురళి ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. భార్గవ్ అనుచరులే ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News