Venkaiah Naidu: 'నీ పనిని నీవు చేయి' అని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడు: వెంకయ్య నాయుడు

  • మనలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను నిర్వహించాలి
  • లేదంటే హక్కులు అమలు కావు
  • మనమంతా మాతృభాషను గౌరవించాలి
  • మాతృభాష కంటి చూపులాంటిది, ఇతర భాష కళ్లద్దాల వంటిది 

'నీ పనిని నీవు చేయి' అని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మనలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను నిర్వహించకుంటే హక్కులు అమలు కావని చెప్పారు. మన దేశాన్ని మార్చడమనేది మన లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ 70వ వార్షిక దినోత్సవం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఈ రోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మొదట తెలుగులో మాట్లాడుతూ... మనమంతా మాతృభాషను గౌరవించాలని అన్నారు. మాతృభాష కళ్లలాంటిదని, ఇతర భాషలు కళ్లద్దాల వంటివని చెప్పారు. మాతృభాష పరిరక్షణకు కృషి చేయాలని ఆయన అన్నారు. మన మొదటి ప్రాధాన్యత మాతృభాషకే ఇచ్చి, ఆ తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.

భాష పరంగా ఎటువంటి సమస్య ఉండకూడదని వెంకయ్య నాయుడు చెప్పారు. మన రాజ్యాంగాన్ని ఇప్పటివరకు 103 సార్లు సవరించామని తెలిపారు. పరిపాలనలో మనం అనేక మార్పులు తీసుకొస్తున్నామని వ్యాఖ్యానించారు. దేశ నిర్మాణంలో పౌరులంతా భాగం కావాలన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని అన్నారు.

  • Loading...

More Telugu News