TSRTC: మా సెల్ ఫోన్లు లాక్కుని చర్చలు జరిపారు: ఆర్టీసీ జేఏసీ నేతల అసంతృప్తి

  • అసంపూర్తిగా ముగిసిన చర్చలు
  • ఇవి నిర్బంధ చర్చలు, సమ్మె కొనసాగుతుందన్న జేఏసీ
  • కొన్ని డిమాండ్లపైనే మాట్లాడతామని యాజమాన్యం పేర్కొందని వెల్లడి

ఆర్టీసీ యాజమాన్యంతో తాము జరిపిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ చరిత్రలో ఇంతటి నిర్బంధ చర్చలు తాను చూడలేదని చెప్పారు. ఆర్టీసీ సమ్మె ఆగదని, కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాము డిమాండ్ చేసిన అన్ని అంశాలను యాజమాన్యం పట్టించుకోలేదని కొన్ని డిమాండ్లనే వారు పరిగణనలోకి తీసుకున్నారన్నారు.

హైకోర్టు ఆదేశాల మేరకు  ఎర్రమంజిల్ లోని ఈఎన్ సీ కార్యాలయంలో ఇరు వర్గాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ యాజమాన్యంతో జరిగిన ఈ చర్చల్లో అశ్వత్థామరెడ్డి, మరో ముగ్గురు సహ కన్వీనర్లు కార్మికులకు ప్రాతినిధ్యం వహించారు.  

చర్చల అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ చర్చల ప్రారంభానికి ముందే మా మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. ఇవి నిర్బంధ చర్చలు. మేము 26 డిమాండ్లను వారి ముందుంచగా యాజమాన్యం 21 డిమాండ్లపైనే మాట్లాడతామంది. యాజమాన్యం ముందే ఒక ఎజెండాతో సమావేశస్థలికి వచ్చింది. లోపల జరిగిన సంభాషణలపై మా కార్మికులతో కలిసి చర్చిస్తాం. తిరిగి చర్చలకు ఆహ్వానిస్తే సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు.

ఈ చర్చలు కోర్టును తృప్తి పరిచేందుకు జరిపినట్లుందని, సమ్మె కొనసాగుతుందని జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి చెప్పారు. చర్చల్లో పాల్గొన్న మరో కో కన్వీనర్ వీఎస్ రావు మాట్లాడుతూ జేఏసీ నేతలు చర్చలకు సహకరించలేదంటూ ఆర్టీసీ యాజమాన్యం ఆరోపిస్తోందన్నారు.

  • Loading...

More Telugu News