Telangana: అలా మాట్లాడే నైతికహక్కు చంద్రబాబుకు లేదు: ధర్మాన ప్రసాదరావు

  • ఏపీలో పత్రికాస్వేచ్ఛ నశించిపోయిందట
  • చంద్రబాబు చట్టాలను మోసగించి దోచుకున్నారు
  • రాజకీయపార్టీలను సర్వనాశనం చేయాలని చూశారు

 ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన అనుకూల మీడియా, ఆయన తాబేదారులు, కొంతమంది సహచరులు కలసి, ఏపీలో పత్రికాస్వేచ్ఛ నశించిపోయిందని మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈవిధంగా మాట్లాడే నైతికహక్కు చంద్రబాబుకు లేదని భావిస్తున్నట్టు చెప్పారు.

గడచిన ఐదేళ్లలో బాబు పాలన చూశామని, అనేక చట్టాలను మోసగించి, కోర్టులకు దొరకకుండా, ఎత్తుగడలతో ప్రజాధనాన్ని దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తన తాబేదారులకు, అనుకూలమైన సంస్థలకు చంద్రబాబు దోచిపెట్టిన విషయం బహిరంగ రహస్యం అన్నారు. ఆనాడు తనకు అనుకూలంగా ఉన్న అనేక పత్రికలను అడ్డంపెట్టుకుని అనేక మంది జీవితాలతో ఆడుకున్నారని, రాజకీయంగా పతనం చేయాలని, రాజకీయపార్టీలను సర్వనాశనం చేయాలని చూశారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

వైసీపీ ప్రభుత్వ నాలుగు నెలల పాలనలో ప్రజాస్వామ్యం లేదని, పత్రికా స్వేచ్ఛ హరించుకుపోయిందని, ఈ రాష్ట్రంలో గూండాయిజం సాగుతోందని, బీహార్ లా అయిపోయిందని మాట్లాడుతున్న చంద్రబాబు, నాడు తన పాలన ఎలా సాగిందో ఆయన చూసుకున్నారా? టీడీపీ హయాంలో రాష్ట్రం ఎంత అప్రతిష్టపాలైందో, ఎంత ధనం దోపిడీ అయిపోయిందో, ఎన్ని వ్యవస్థలను నాశనం చేశారో అంటూ ఆరోపణలు గుప్పించారు.

  • Loading...

More Telugu News