Ajit Dhoval: మనకు సాక్ష్యాలు కావాలి.. దొరికిన సాక్ష్యాలను నిర్మూలించవద్దు: అజిత్ దోవల్

  • ఉగ్రవాదులకు పాక్ చేయూతపై సాక్ష్యాలను సేకరించండి
  • ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడంతో  మన పని పూర్తి కాలేదు
  • పాక్ క్రూర చర్యలను అంతర్జాతీయ సమాజానికి తెలియపర్చాలి

ఉగ్రవాదులకు పాకిస్థాన్ బాహాటంగా అందిస్తున్న అన్ని రకాల సహాయంపై భారత భద్రత సంస్థలు సాక్ష్యాలు సేకరించి వాటిని అంతర్జాతీయంగా బహిర్గతం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్  ఏటీఎస్ (యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్), ఎస్టీఎఫ్ (స్పెషల్ టాస్క్ ఫోర్స్) చీఫ్ లకు సూచించారు. ఢిల్లీలో జాతీయ పరిశోధన సంస్థ (ఎన్ఐఏ) ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన సదస్సులో దోవల్ ప్రసంగించారు. పొరుగుదేశమైన పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేయడమేకాక, వారికి ఆయుధాలను సమకూర్చడమే ఎజెండాగా తన విధానాన్ని కొనసాగిస్తోందని తెలిపారు.

 అయితే పాక్ పాల్పడుతున్న ఈ దుశ్చర్యలకు సంబంధించిన సాక్ష్యాలను సంపాదించి అంతర్జాతీయ మీడియా ముందు బహిర్గతం చేయాలని పేర్కొన్నారు. ‘పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రేరిపిస్తోంది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు మాత్రమే (ఏటీఎస్ / ఎస్టీఎఫ్ / ఎన్ఐఏ) పాక్ ఉగ్ర కార్యకలాపాలపై సాక్ష్యాలను సేకరించగలరు. మనకు నిజాలు, సాక్ష్యాలు కావాలి. దొరికిన సాక్ష్యాలను నిర్మూలించవద్దు. వాటిని ఉపయోగించుకోవాలి. వాటిని మీడియాకు ఇవ్వాలి. ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి’ అని దోవల్ పిలుపు నిచ్చారు.

భారత్ లో ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో ఎన్ఐఏ చేస్తున్న కృషిని దోవల్ ప్రశంసిస్తూ.. ఈ సంస్థ మిగతా భద్రతా సంస్థలను మించి ఈ దిశలో ముందుకు దూసుకుపోతోందని దోవల్ అన్నారు. ఏటీఎస్, ఎస్టీఎఫ్ సిబ్బంది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి సైనికులుగా మారాలని పేర్కొన్నారు. ఒక వ్యక్తి సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ (సీఏఫీఎఫ్)లో ఉద్యోగిగా చేరగానే... తానొక విచారణాధికారిగా కాకుండా, సైనికుడిగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ‘అది ముజాహిదీన్, లష్కరే తాయిబా లేదా ఇతర ఏ ఉగ్రవాద సంస్థైనా కానీయ్యండి మీరు సైనికుడిగా ముందుకు దూసుకుపోండి’ అని దోవల్ అన్నారు.  

'ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం మనకు కొత్తకాదు. ఉగ్రవాదంతో పోరాటం అన్న విషయం సుస్పష్టమే.. గత 30 ఏళ్లుగా దాన్ని చూస్తున్నాము. ఉగ్రవాదులను హతమార్చడంతో  అది సమసిపోదు. దాని మూలాలను వెతికి  ఏరిపారేయాలి. ఇందుకు మూడు లక్ష్యాలుగా ముందుకు సాగాలి.  ఇందులో... అసలు ఉగ్రవాదులు ఎవరు? వారు తమకు కావాల్సిన నిధులు, ఆయుధాలు ఎక్కడి నుంచి పొందుతున్నారు?  ఏయే దేశాలు వారికి మద్దతును అందిస్తున్నాయి? అనే విషయాలను వెలికితీయాలి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాలను అంతర్జాతీయ కోర్టులముందుకు తీసుకెళ్లాల్సి ఉంది.  ఇది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కీలక దశ. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ‘రీసెర్చ్ అండ్ అనాలిస్ వింగ్, ఇంటెలిజెన్స్ బ్యూరో, జమ్మూకశ్మీర్ ప్రభుత్వాలు తమ వంతు కృషిని చేశాయి. కాని ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో రాష్ట్ర పోలీసులదే ప్రథమ పాత్ర అని దోవల్ పేర్కొన్నారు.

అంతకు ముందు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ యోగేష్ చందర్ మోది సదస్సును ప్రారంభిస్తూ.. బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉల్ ముజాహిదీన్, భారత్ లో కార్యకలాపాలను విస్తరిస్తోందని చెప్పారు. ముఖ్యంగా అక్రమ వలసలు కొనసాగుతున్న తూర్పు సరిహద్దు రాష్ట్రాల్లో దాని ఉనికి వేగంగా విస్తరిస్తోందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News