Lottery: లాటరీ టికెట్ కొన్నది ముగ్గురు... ఆ తర్వాత భాగస్వాములైంది మరో ముగ్గురు.. అందరూ కోటీశ్వరులయ్యారు!

  • కేరళలో ఆసక్తికర ఘటన
  • లాటరీ కొన్న సేల్స్ మెన్
  • రూ.12 కోట్ల ఫస్ట్ ప్రైజ్ గెలుపు

కేరళలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. కొల్లాం జిల్లాలో ఓ జ్యుయెలరీ షాపులో పనిచేసే సేల్స్ ఉద్యోగులు ఆరుగురు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు. రాజీవన్, రామ్జీ, రతీష్, రోనీ, వివేక్, సుబిన్ అనే సేల్స్ మెన్ నిజంగా నక్క తోకను తొక్కారని చెప్పాలి. వీరిలో ముగ్గురు కేరళ లాటరీ డిపార్ట్ మెంట్ వారి బంపర్ లాటరీ కొనుగోలు చేశారు. అది కూడా బుధవారం రూ. 300 పెట్టి లాటరీ టికెట్ కొనుగోలు చేసి ఆ మరుసటి రోజే కోటీశ్వరులయ్యారు.

మరికొన్ని గంటల్లో లాటరీ ఫలితాలు వెలువడతాయనగా మరో ముగ్గురు వీరితో భాగస్వాములయ్యారు. లాటరీ మొత్తం ఎంత వచ్చినా సమంగా పంచుకునే ఒప్పందంతో అందరూ లాటరీ టికెట్ సొంతదారులయ్యారు. వీరు కొనుగోలు చేసిన లాటరీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ప్రథమ బహుమతి రూ.12 కోట్లు కాగా, ట్యాక్సులు ఇతరత్రా మినహాయింపులు పోగా, రూ.7.5 కోట్లు చేతికి రానుంది.

ఏదైతేనేం, తలో కోటి రూపాయలు అందుకోవడం ఖాయమైంది. దాంతో ఆ సేల్స్ మెన్ ఆనందం పట్టలేకపోతున్నారు. వారిలో అత్యధికులు తమ అప్పులు తీర్చేందుకు ఆ నగదు వినియోగిస్తామని చెబుతున్నారు. కొంతమేర సామాజిక సేవకు కూడా ఖర్చు చేస్తామని అంటున్నారు.

  • Loading...

More Telugu News