- మంగళవాయిద్యాలతో స్వాగతం పలికిన వేదపండితులు
- అమ్మవారి దర్శనం అనంతరం దివ్యాశీర్వచనం
- అనంతరం మహా మండపం ఏడో అంతస్తులోని కార్యాలయంలోకి
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరి ఉన్న కనకదుర్గమ్మ ఆలయం ( దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం) ఈవోగా నియమితులైన ఎం.వి.సురేష్బాబు ఈరోజు ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు అన్నవరం దేవస్థానం ఈవోగా విధులు నిర్వహించిన సురేష్బాబును విజయవాడకు బదిలీ చేస్తూ రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బాధ్యతల స్వీకారానికి ఆలయానికి చేరుకున్న సురేష్బాబుకు మంగళవాయిద్యాలతో వేదపండితులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం దివ్యాశీర్వచనం తీసుకున్న ఈవో మహామండపం ఏడో అంతస్తులో ఉన్న తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ దుర్గగుడి అభివృద్ధికి, భక్తులు సౌకర్యాల కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. త్వరలో జరగనున్న దసరా ఉత్సవాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దిగ్విజయంగా నిర్వహిస్తామని తెలిపారు.