Hyderabad: సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. రసాయన కర్మాగారంలో ఎగసిపడుతున్న మంటలు

  • పాశమైలారంలోని కెమికల్ ఫ్యాక్టరీలో ఘటన
  • పక్కనే ఉన్న మరో మూడు కంపెనీలకూ అంటుకున్న మంటలు
  • కోట్లాది రూపాయల నష్టం

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని ఓ రసాయన కర్మాగారంలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. అనంతరం నిల్వ ఉన్న రసాయనాలకు అంటుకుని ఫ్యాక్టరీ మొత్తానికి మంటలు విస్తరించాయి. మంటల్లో చిక్కుకుని గాయపడిన ముగ్గురు కార్మికులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు, ఫ్యాకర్టీ అంతటా మంటలు వ్యాపించడంతో పక్కనే ఉన్న మరో మూడు కంపెనీలు కూడా అంటుకున్నాయి. సమాచారం అందుకున్న ఐదు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే, ఆ ప్రాంతంలో నీటి కొరత ఉండడంతో మంటలను అదుపు చేయడం కొంత ఆలస్యమైంది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Hyderabad
patancheru
pashamailaram
chemicle factory
Fire Accident
  • Loading...

More Telugu News