Manchester: మాంచెస్టర్ లో సానుకూల వాతావరణం... హుషారుగా ప్రాక్టీస్ చేసిన టీమిండియా ఆటగాళ్లు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-37b47709ee909558857080e45228415121e9b7f8.jpeg)
- మరికాసేపట్లో ఆట పునఃప్రారంభం
- సాధనలో ఉల్లాసంగా గడిపిన టీమిండియా ఆటగాళ్లు
- 46.1 ఓవర్ల నుంచి ఆట కొనసాగించనున్న కివీస్
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్ సమరానికి ఆతిథ్యమిస్తున్న మాంచెస్టర్ నగరంలో వరుణుడు శాంతించినట్టే కనిపిస్తోంది. నిన్న సెమీఫైనల్ మ్యాచ్ సగంలో అడ్డుతగిలిన వరుణుడు భారత అభిమానులను తీవ్ర నిరాశలో ముంచెత్తాడు. ఈ నేపథ్యంలో, మ్యాచ్ రిజర్వ్ డేలోకి ప్రవేశించగా, మరికాసేపట్లో ఆట కొనసాగనుంది. న్యూజిలాండ్ 46.1 ఓవర్ల నుంచి ఆట పునఃప్రారంభించనుంది. కివీస్ స్కోరు 5 వికెట్లకు 211 పరుగులు కాగా, ఆ జట్టు భారీ స్కోరు చేసే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాలి. ఈ క్రమంలో, టీమిండియా ఆటగాళ్లు మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో ఈ ఉదయం ఉత్సాహంగా సాధన చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య తదితరులు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా, మరికొందరు ఉల్లాసం కోసం ఫుట్ బాల్ ఆడారు. మరోవైపు, టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ లెగ్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ నుంచి మెళకువలు నేర్చుకుంటూ కనిపించాడు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-78d6db00be1d0508e1d39cfe5b81e1be8329ade2.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-20d1350c1315fadcf70228a48bb41dff6d623d5a.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-b114d280b261c64225f7e8dd9c6fcd9e7e81b7c0.jpg)