అయ్యో పాపం...గొంతులో ద్రాక్ష పండు చిక్కుకుని చిన్నారి మృతి
- మంచం పక్కన ఉన్న పండ్లను తిన్న తొమ్మిది నెలల బాలుడు
- ఊపిరాడక అక్కడికక్కడే మృతి
- భోరుమన్న తల్లిదండ్రులు
తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామన్నపల్లికి చెందిన భూపతిరెడ్డి, లత దంపతుల కొడుకు వసంత్రెడ్డి (9 నెలలు). శుక్రవారం రాత్రి తల్లిదండ్రులు ద్రాక్ష పండ్లను గుజ్జుగా చేసి చిన్నారి చేత తినిపించి నిద్రపుచ్చారు. కాసేపటికి నిద్ర లేచిన చిన్నారి మంచం పక్కనే ఉన్న ద్రాక్ష గుత్తి నుంచి ఓ పండు తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. పొరపాటున దాన్ని మింగేయగా అది గొంతుకు అడ్డంగా ఉండిపోయి ఊపిరాడక ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. బిడ్డ పరిస్థితి చూసి బెంబేలెత్తిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని సిద్ధిపేటలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.