vijayawada: విజయవాడలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం.. కలకలం

  • అమ్మమ్మ ఇంటి నుంచి వస్తూ అదృశ్యం
  • ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని తల్లిదండ్రుల ఆందోళన
  • పటమట పోలీసులకు ఫిర్యాదు

విజయవాడలో ఇంటర్ చదువుతున్న దుర్గ (16) అనే విద్యార్థిని అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... నగరంలోని భారతీనగర్ లో తల్లిదండ్రులతో కలసి దుర్గ నివసిస్తోంది. మాచవరంలోని ఎస్ఆర్ఎస్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. సెలవులు కావడంతో నాలుగు రోజుల క్రితం రామలింగేశ్వరనగర్ లో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లింది.

కాలేజీ పున:ప్రారంభం కావడంతో ఈ ఉదయం 7 గంటలకు అమ్మమ్మ ఇంటి నుంచి భారతీనగర్ కు కాలినడకన దుర్గ బయల్దేరింది. తన ఇంటికి చేరుకోవాలంటే కిలోమీటర్ దూరం కాలి నడకన వచ్చి, షేర్ ఆటో ఎక్కాలి. అయితే, రెండు గంటలు గడిచిపోయినా ఆమె ఇల్లు చేరలేదు. తెలిసినవారిని వాకబు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో, ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఎవరైనా తమ బిడ్డను కిడ్నాప్ చేసి ఉంటారంటూ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా కేసును చేధిస్తామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News