APSRTC: ఉన్నతాధికారులతో సానుకూలంగా ముగిసిన ఆర్టీసీ జేఏసీ చర్చలు

  • ఈ నెల 13న సమ్మె చేయాలని భావించిన ఆర్టీసీ కార్మిక సంఘాలు
  • దాదాపు 3 గంటలపాటు చర్చలు
  • ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవడంపై ప్రధానంగా చర్చ

డిమాండ్ల పరిష్కారానికి గాను ఈ నెల 13 నుంచి సమ్మెకు దిగేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ రాష్ట్ర ఉన్నతాధికారులతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చర్చలు జరిపింది. దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చలు సానుకూల వాతావరణంలో ముగియడంతో సమ్మె ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఈ నెల 10న కార్మిక సంఘాల నేతలతో జేఏసీ చర్చించిన పిదప సమ్మెపై తుది నిర్ణయం ఉంటుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ దామోదర్ తెలిపారు.

సమ్మె నోటీసు, ఆర్టీసీ డిమాండ్లకు అనుగుణంగానే చర్చలు జరిపామని ఆయన వెల్లడించారు. తమ డిమాండ్లు నెరవేరే దిశగానే చర్చల్లో పురోగతి కనిపించిందని అన్నారు. కష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం ఎలా ఆదుకోవాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగిందని దామోదర్ వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలు కల్పించాలన్న డిమాండ్ పై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి అధికారులు సుముఖంగా ఉన్నట్టు ఈ చర్చల ద్వారా వెల్లడైందని తెలిపారు.

  • Loading...

More Telugu News