Narendra Modi: హీరో అజయ్ దేవగణ్ కుటుంబానికి లేఖ రాసిన ప్రధాని మోదీ

  • ఇటీవలే మృతి చెందిన అజయ్ దేవగణ్ తండ్రి
  • వీరూ దేవగణ్ సేవలను కీర్తించిన ప్రధాని
  • సాహసోపేతమైన స్టంట్ మాస్టర్ అంటూ కితాబు

ఎవరూ ఊహించని రీతిలో ప్రధాని నరేంద్ర మోదీ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కుటుంబానికి లేఖ రాశారు. ఇటీవలే అజయ్ దేవగణ్ తండ్రి, ప్రముఖ ఫైట్ మాస్టర్ వీరూ దేవగణ్ కన్నుమూశారు. అయితే ఎన్నికల హడావుడిలో ప్రధాని ఎంతో బిజీగా ఉండడంతో స్పందించలేకపోయారు. ఈ నేపథ్యంలో, అజయ్ దేవగణ్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ సుదీర్ఘమైన లేఖ రాశారు.

"బాలీవుడ్ లో సాహసోపేతమైన స్టంట్ మాస్టర్ ఎవరంటే వీరూ దేవగణ్ అనే చెప్పాలి. తన వద్ద పనిచేసే వ్యక్తులను కంటికి రెప్పలా చూసుకునే వీరూ చనిపోయారని తెలిసి చాలా బాధపడ్డాను. సినిమాపై ఉన్న గౌరవంతో ఎన్నో నవ్యరీతులను వెండితెరకు పరిచయం చేసిన వ్యక్తి వీరూ దేవగణ్. గ్రాఫిక్స్ లేని కాలంలో ఆయన చేసిన సాహసాలు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతాయి.

పనిని నమ్ముకుని, దాని కోసం ఎంతకైనా తెగించేవారికి వీరూ దేవగణ్ ఓ స్ఫూర్తి ప్రదాత. మనం తీసుకునే రిస్క్ స్థాయిని బట్టే మన ప్రపంచం పయనిస్తుంది. ఆ విధంగా చూస్తే వీరూ దేవగణ్ లాంటి వ్యక్తి ఎంతో అరుదుగా కనిపిస్తారు. ఈ సందర్భంగా దేవగణ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను"  అంటూ లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News