Andhra Pradesh: రెండున్నర నెలలు ఆగండి.. 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా!: ఏపీ ముఖ్యమంత్రి జగన్

  • 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీర్ ను నియమిస్తా
  • నెలకు రూ.5 వేలు గౌరవవేతనం ఇస్తా
  • ఫిర్యాదు కోసం సీఎంవోలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం
  • విజయవాడ బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవడానికి విప్లవాత్మక మార్పులు తీసుకుని వస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అందుకోసం ఆగస్టు 15 నాటికి కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే రాబోయే రెండున్నర నెలల్లో ఊర్లలో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. నిరుద్యోగ యువతను గ్రామ వాలంటీర్లుగా నియమిస్తామని చెప్పారు.

ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేస్తామనీ, ఇందుకోసం ప్రతీ 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీర్ ను నియమిస్తామన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జగన్ మాట్లాడారు. గ్రామాల్లో చదువుకున్న పిల్లలు, ప్రజాసేవ చేయాలనుకునే పిల్లలను ఇందుకు ఎంపిక చేస్తామని జగన్ తెలిపారు. వీరికి గౌరవవేతనంగా రూ.5,000 చెల్లిస్తామని ప్రకటించారు.

ఈ వ్యవస్థలో లంచాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే వాలంటీర్లకు ఈ మొత్తం చెల్లిస్తామని చెప్పారు. మెరుగైన ఉద్యోగాలు వచ్చేవరకూ ఈ పిల్లలకు గ్రామ వాలంటీర్లుగా అవకాశాలు కల్పిస్తామన్నారు. తమకు సంక్షేమ పథకాల ఫలాలు అందకుంటే, లంచాలు, వేధింపులు జరిగితే ఫిర్యాదు చేయడానికి కాల్ సెంటర్ ను కూడా ఆగస్టు 15న ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కాల్ సెంటర్ తన కార్యాలయంలో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు ఎప్పుడైనా ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకోవచ్చని అన్నారు.

  • Loading...

More Telugu News