Russia: "అవినీతి సొమ్ముతో ఇల్లు కట్టారా?" అని ప్రశ్నించిన రిపోర్టర్.. కోపంతో ఎత్తి కుదేసిన రష్యా అధికారి!

  • ప్రశ్నల వర్షం కురిపించిన యువ రిపోర్టర్
  • అవినీతిపై ప్రశ్నించినందుకు ఓ అధికారి దౌర్జన్యం
  • బిక్కచచ్చిపోయిన రిపోర్టర్

మీడియా రిపోర్టర్లు అడిగే ప్రశ్నలు ఒక్కోసారి రాజకీయ నాయకులను, అధికారులను తీవ్ర అసహనానికి గురిచేస్తుంటాయి. సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో సదరు ప్రముఖులు తమ అసహనాన్ని ఏదో ఒక రూపంలో ప్రదర్శిస్తుంటారు. రష్యాలో కూడా ఇదే జరిగింది. ఓ మీడియా ప్రతినిధి రష్యా అధికారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. సైబీరియా జిల్లా ముఖ్య అధికారి సెర్జీ జైత్సేవ్ (52) తో ముఖాముఖి కోసం ఇవాన్ లిటోమిన్ అనే జర్నలిస్టు వచ్చాడు. యువకుడైన ఇటోమిన్ అడిగిన ప్రశ్నలు జైత్సేవ్ ను పదేపదే ఇరకాటంలోకి నెట్టాయి.

2015లో రష్యాలో కార్చిచ్చు చెలరేగగా, నష్టపరిహారం సొమ్మును అధికారులు దిగమింగినట్టు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, అవినీతి సొమ్ముతో మీరు రాజసౌధంలాంటి భవనం నిర్మించారా? అని లిటోమిన్ అడగడంతో జైత్సేవ్ లో కోపం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా ముందుకు ఉరికి ఆ యువ జర్నలిస్టును దొరకబుచ్చుకుని ఎత్తి నేలపై కుదేశాడు. ఊహించని హఠాత్పరిణామానికి ఆ పాత్రికేయుడు బిక్కచచ్చిపోయాడు. అక్కడున్న వారు వెంటనే కలుగజేసుకుని లిటోమిన్ ను బయటికి తీసుకువచ్చారు. ఈ ఘటన రష్యాలో అధికారవర్గాల్లో నెలకొన్న అవినీతికి నిదర్శనం అని అక్కడి మీడియా ఎలుగెత్తి ఘోషిస్తోంది.

  • Loading...

More Telugu News