Andhra Pradesh: నేడు, రేపు బయటకు వెళ్లొద్దు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

  • సోమ, మంగళవారాల్లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం
  • పిల్లలు, వృద్ధులు బయటకు రావొద్దన్న కడప కలెక్టర్
  • ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ ధార్మిక సంస్థలకు పిలుపు

ప్రచండ భానుడి ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక, నేడు, రేపు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సోమ, మంగళవారాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

రాబోయే రెండు రోజులు ఉష్ణోగ్రతల్లో అసాధారణ మార్పులు ఉంటాయని, వడగాలులు తీవ్రం అవుతాయని వాతావరణ శాఖ నుంచి సమాచారం అందినట్టు కడప కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండలో బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల పదో తేదీ వరకు ఎండల తీవ్రత ఇలానే ఉంటుందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గొడుగు, టోపీ, లేదంటే తలపై వస్త్రం కప్పుకోకుండా బయటకు రావొద్దన్నారు.  వృద్ధులు, పిల్లలు ఎండలో బయటకు రాకపోవడమే మంచిదన్నారు.

స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చలివేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలని,  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే పశువులకు నీటి తొట్టెల ద్వారా నీటిని ఏర్పాటు చేయాలని పశుసంవర్ధకశాఖ అధికారులు సూచించారు. 

  • Loading...

More Telugu News