Andhra Pradesh: ప్రేమకు నో చెప్పిందని యువతి కిడ్నాప్.. ఛేజ్ చేసి మరీ కాపాడిన స్థానికులు!

  • ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘటన
  • ప్రేమించాలని  యువతికి నయీంతుల్లా వేధింపులు
  • ఒప్పుకోకపోవడంతో కారులో ఎత్తుకెళ్లిన దుండగుడు

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. ప్రేమించాలని వెంటపడినప్పటికీ అంగీకరించకపోవడంతో యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. అయితే కారును వెంబడించిన స్థానికులు అతడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

జిల్లాలోని పాలకోడేరు మండలం విస్సా కోడేరుకు చెందిన ఓ యువతి ఈరోజు తల్లితో కలిసి ఓ పని నిమిత్తం ఇంటర్నెట్ కేంద్రానికి వచ్చింది. పని ముగించుకుని వెళుతుండగా నయీంతుల్లా అనే వ్యక్తి కారుతో అక్కడికి చేరుకున్నాడు. అనంతరం యువతిని అమాంతం కారులోకి లాక్కుని తలుపు వేసేశాడు. మరో యువకుడు కారును వేగంగా పోనిచ్చాడు. కుమార్తెను ఎత్తుకెళ్లిపోవడంతో ఆమె తల్లి భయంతో కేకలు వేసింది. దీంతో స్థానికులు బైక్ లపై కారును వెంబడించారు.

చివరికి భీమవరం సమీపంలోని తాడేరు వద్ద కారును వారంతా చుట్టుముట్టారు. యువతిని కాపాడి నిందితుడు నయీంతుల్లాను చితకబాదారు. ఈ సందర్భంగా కారును నడిపిన మరో యువకుడు ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. నయీంతుల్లాను స్థానికులు పోలీసులకు అప్పగించారు.

ఈ వ్యవహారంపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రేమ పేరుతో తన కుమార్తెను నయీంతుల్లా గతకొంత కాలంగా వేధిస్తున్నాడని బాధితురాలి తల్లి వాపోయింది. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది.

  • Loading...

More Telugu News