Telangana: ఆ అవమానాన్ని మనసులో పెట్టుకునే శ్రీనివాస్ రెడ్డి ఈ హత్యలకు పాల్పడ్డాడు: మహేశ్ భగవత్

  • శ్రీనివాసరెడ్డిది సైకో మనస్తత్వం
  • డబ్బు కోసం గొడవపడిన వేశ్యను కూడా చంపేశాడు
  • హాజీపూర్ హత్యల నిందితుడి నిజస్వరూపం బయటపెట్టిన సీపీ

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ గ్రామంలో వెలుగుచూసిన వరుస హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్ రెడ్డే ఈ దారుణాలకు పాల్పడినట్టు గుర్తించారు. అతడిని బంధువుల ఇంట్లో అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డిది మొదటి నుంచి ఉన్మాద స్వభావం అని వెల్లడించారు. శ్రీనివాస్ రెడ్డి లిఫ్ట్ మెకానిక్ గా పనిచేస్తుంటాడని చెప్పారు.

ఓసారి కర్నూలులో స్నేహితులతో కలిసి వేశ్యను రూమ్ కి తీసుకువచ్చి, ఆపై ఆమె డబ్బుల కోసం గొడవపడితే చంపేశాడని వివరించారు. ఆ వేశ్య మృతదేహాన్ని అపార్ట్ మెంట్ పైభాగంలో ఉన్న నీళ్లులేని వాటర్ ట్యాంక్ లో వేశారని మహేశ్ భగవత్ వెల్లడించారు. అయితే, సొంతూరు హాజీపూర్ లో వరుస హత్యలకు చాన్నాళ్ల కిందట జరిగిన ఓ సంఘటన కారణమని చెప్పారు.

అప్పట్లో శ్రీనివాస్ రెడ్డిపై ఓ ఈవ్ టీజింగ్ కేసు నమోదైతే, లోక్ అదాలత్ లో రాజీపడ్డారని, కానీ అమ్మాయిని వేధించడంతో గ్రామస్తులు అతడ్ని చితకబాదారని సీపీ తెలిపారు. ఊర్లో వాళ్లు తనను చెట్టుకు కట్టేసి మరీ కొట్టడాన్ని అవమానంగా భావించాడని, ఆ ఘటనను మనసులో పెట్టుకుని గ్రామస్తులపై ఏ విధంగానైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించి అమ్మాయిలపై అత్యాచారం చేసి బావిలో పూడ్చిపెట్టేవాడని వివరించారు.

  • Loading...

More Telugu News