Nandamuri: నందమూరి బాలకృష్ణ ఇంత దిగజారుడుతనానికి ఎందుకు పాల్పడ్డారో?: వైఎస్ షర్మిళ

  • ఇటీవల తనపై జరిగిన దుష్ప్రచారంపై షర్మిళ  స్పందన
  • ఎన్బీకే అనే ఓ బిల్డింగ్ నుంచి నాపై దుష్ప్రచారం జరిగింది
  • బాలకృష్ణే ఈ నీచమైన పుకార్లు పుట్టించారని నమ్ముతా

ప్రముఖ హీరో ప్రభాస్, వైసీపీ మహిళా నాయకురాలు వైఎస్ షర్మిళకు మధ్య సంబంధాలు అంటగడుతూ సామాజిక మాధ్యమాల వేదికగా దుష్ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై హైదరాబాద్ లో పోలీసులకు షర్మిళ ఫిర్యాదు చేయడమూ విదితమే. ఓ ఇంటర్వూలో ఇదే విషయాన్ని ప్రస్తావించగా షర్మిళ సమాధానమిస్తూ, గతంలో 2014కు ముందు తనపై ఈ దుష్ప్రచారం ప్రారంభించారని, ఇవేవో పుకార్లు అనుకుని పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. మళ్లీ, ఈ ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి అదే మాదిరి పుకార్లు మొదలు పెట్టారని, ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ఈ పని చేస్తున్నారన్న విషయం తనకు అర్థమైందని అన్నారు.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పని చేసేది టీడీపీయేనని, ఎన్నికలు సమయం సమీపిస్తున్న కొలదీ ఈ దుష్ప్రచారం మరింత ఎక్కువగా చేస్తారన్న విషయం అర్థమైందని, వ్యక్తిగతంగా దీని గురించి మాట్లాడటం తనకు ఇబ్బందికరం అయినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అన్నారు. పోలీసులు చెబుతున్న దాన్ని బట్టి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఎన్బీకే అనే ఓ బిల్డింగ్ ఉందని, ఆ బిల్డింగ్ నందమూరి బాలకృష్ణది అని, అక్కడి నుంచి తనపై దుష్ప్రచారం జరిగిందని, ఐపీ అడ్రసులను అనుసరించి పోలీసులు చెబుతున్నారని అన్నారు.

 ఈ బిల్డింగ్ నుంచి తనపై దుష్ప్రచారం ఒక ఎత్తయితే, టీడీపీకి అనుకూలంగా ఉండే కొన్ని వెబ్ సైట్స్ చేసిన దుష్ప్రచారం మరో ఎత్తని ఆవేదన వ్యక్తం చేశారు. బాలకృష్ణ బిల్డింగ్ నుంచి ఇంత జరుగుతుంటే ఆయనకు తెలియదని నేను ఎట్టా అనుకుంటా? అని ప్రశ్నించారు. స్వయంగా బాలకృష్ణే తనపై ఈ నీచమైన పుకార్లు పుట్టించారని, వాటిని ప్రచారం చేశారని తాను నమ్ముతున్నానని అన్నారు. బాలకృష్ణ ఇంత దిగజారుడు తనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే సమాధానం చెప్పాలి అని అన్నారు.

  • Loading...

More Telugu News