Pawan Kalyan: చేతికి సెలైన్ సూదితోనే ప్రచారానికి వచ్చిన పవన్ కల్యాణ్

  • తెనాలి చేరుకున్న జనసేనాని
  • మనోహర్ తో కలిసి ప్రచారం
  • అభిమానుల హర్షం

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థత నుంచి కోలుకుని మళ్లీ ఎన్నికల ప్రచారం బాటపట్టారు. వడదెబ్బ కారణంగా శనివారం పగలంతా విశ్రాంతి తీసుకున్న పవన్ సాయంత్రం తెనాలి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారం కోసం వచ్చిన పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ ఎక్కించే సూది అలాగే ఉంది. దాన్నిబట్టి ఆయన చికిత్స మధ్యలోనే ప్రచారానికి వచ్చినట్టు అర్థమవుతోంది. ఎన్నికల ప్రచారం మరికొన్నిరోజుల్లో ముగియనుండడంతో అభ్యర్థుల కోసం ఆయన అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా వచ్చినట్టు తెలుస్తోంది.

తెనాలిలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ నాయకుల్లా భూములు ఆక్రమించుకునేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ నేతలు కూడా భూకబ్జాలు చేసేందుకు రాలేదని అన్నారు. తాము ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేందుకు వచ్చామని, అదే సమయంలో వ్యవస్థలను దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను పైకి ఎంత మెత్తగా కనిపిస్తానో, ప్రజలకు నష్టం జరుగుతుంటే మాత్రం అంతే కటువుగా వ్యవహరిస్తానని అన్నారు. జనసేన అన్ని కులాలకు సమప్రాధాన్యత ఇస్తుందని, కులాల ఐక్యతకు పాటుపడతామని పవన్ కల్యాణ్ తెలిపారు. రాజకీయ నాయకులకు కులం, మతం, ప్రాంతం ఉండకూడదని భావిస్తానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News