Chandrababu: నరేంద్ర మోదీ, నీకు పోయే రోజులొచ్చాయి, అందుకే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు!: చంద్రబాబు ఆగ్రహం

  • నిన్న సుధాకర్ యాదవ్ పై ఐటీ దాడి
  • నేడు గుంటూరులో నాని అనే నేత ఇంట్లో దాడులు
  • గిద్దలూరు సభలో సీఎం విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీపై మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు సభలో ఆయన మాట్లాడుతూ, నిన్న సుధాకర్ యాదవ్ అనే నేతపై ఐటీ దాడులు చేయించారని, నేడు గుంటూరులో నాని అనే మరో నేత ఇంటిలో సోదాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నరేంద్ర మోదీ, నీకు పోయే రోజులు వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు' అంటూ బాబు విమర్శించారు. 'నువ్వు మాపై అరాచకాలకు పాల్పడుతుంటే ఆ గోడు తగిలి నీ ఉద్యోగం ఊడుతుంది మోదీ' అంటూ హెచ్చరించారు.

"నీ ఉద్యోగం శాశ్వతం అని అనుకోవద్దు, మళ్లీ రోడ్డుపై తిరిగే రోజొస్తుంది, నిన్ను ఛీకొట్టి ప్రజలు అసహ్యించుకునే రోజొస్తుంది, మా కడుపు కొట్టొద్దు, మమ్మల్ని బాధ పెట్టొద్దు, వైసీపీలో అవినీతి నేతలు లేరా? ఎందుకు మాపై పడుతున్నావు?" అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి ఇళ్లలో కూర్చునేలా చేయాలని పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. "టంగుటూరి ప్రకాశం పంతులు జన్మించిన గడ్డ ఇది, బ్రిటీష్ వాళ్లకు రొమ్ము చూపించి, ధైర్యం ఉంటే కాల్చుకోమని ఎదిరించిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు, ఆయన స్ఫూర్తితో పోరాడుతాం, నువ్వు ఒక్క దాడి చేయిస్తే మేం 10 సీట్లు ఎక్కువగా గెలుస్తాం, నీ అంతు తేలుస్తాం!" అంటూ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News