Guntur District: పేదలకు కేజీ నుంచి పీజీ వరకు విద్యనందిస్తాం: ‘జనసేన’ నేత నాదెండ్ల మనోహర్

- ‘మన తెనాలి- మన మనోహర్’ కార్యక్రమం
- ఇంటింటా ఎన్నికల ప్రచారం
- వెనుకబడిన వర్గాల వారికి వైద్యం అందిస్తాం
ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం పని చేసేది జనసేన పార్టీ అని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ‘మన తెనాలి- మన మనోహర్’ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. తేలప్రోలు, కొల్లిపర గ్రామంలో ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
అనంతరం నాదెండ్ల స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ, కార్పొరేట్ పాఠశాలలో చదివించుకోలేని మధ్యతరగతి బడుగు, బలహీన వర్గాలకు చెందిన అర్హత కలిగిన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందించాలని పార్టీలో నిర్ణయించినట్టు చెప్పారు. సమాజంలో వెనుకబడిన వర్గాల వారికి ఆరోగ్యం, వైద్యం అందిస్తామని అన్నారు. అందరికీ వైద్యం అందించాలనే లక్ష్యంతోనే, ఆరోగ్య బీమా పథకాన్ని మొదట జనసేన సైనికులతో ప్రారంభించినట్లు తెలిపారు.
