Andhra Pradesh: ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే వారికి అదే ఆఖరిరోజు అవుతుంది!: సీఎం చంద్రబాబు హెచ్చరిక

  • మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాం
  • దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందజేశాం
  • మహిళా సాధికారతను ఇంట్లో చేసి చూపా

దేశవ్యాప్తంగా 8 శాతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పిల్లల కోసం టీడీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. అంగన్‌వాడీల్లో పనిచేసేవారికి ప్రతి నెలా రూ.10,500 వేతనం అందిస్తున్నామని పేర్కొన్నారు.  దీపం పథకం ద్వారా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామనీ, మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం గుంటూరులో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా సాధికారత అంటే ఏంటో తాను ఇంట్లో చేసి చూపానని చంద్రబాబు తెలిపారు. దాదాపు 27 ఏళ్ల క్రితం డైరీ పరిశ్రమను ప్రారంభించామని గుర్తుచేసుకున్నారు. తన భార్య భువనేశ్వరి కృషితో ఆ సంస్థను విజయవంతంగా నడుపుతున్నామని అన్నారు. ఏపీలో మహిళలు తయారుచేసిన వస్తువులకు మార్కెటింగ్‌ కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

‘అన్న అమృత హస్తం’ ద్వారా గర్భిణులకు ఒకపూట భోజనం పెడుతున్నామని, సామూహిక సీమంతాలకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. త్వరలోనే కోటి మంది డ్వాక్రా మహిళలకు మొబైల్‌ ఫోన్లు ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే వారికి అదే ఆఖరి రోజు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News