Telangana: మళ్లీ తెరుచుకున్న సిర్పూర్ పేపర్ మిల్లు.. హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్!

  • నిన్న రాత్రి కాగితం ఉత్పత్తి ప్రారంభం
  • కేసీఆర్ చొరవతోనే సాధ్యమయిందన్న నేత
  • పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్ పై ప్రశంసలు

సిర్పూర్ కాగితపు పరిశ్రమలో నిన్న రాత్రి 8.20 గంటలకు మళ్లీ కాగితపు ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2014లో మూతపడ్డ ఈ కంపెనీ మళ్లీ తెరుచుకోవడంపై కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు.

‘గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో సిర్పూర్ పేపర్ మిల్లు మళ్లీ తెరుచుకోవడంతో పాటు ఉత్పత్తి ప్రారంభమయింది. దీనివల్ల వందలాది మంది కార్మికుల జీవితాల్లో సంతోషం నిండనుంది. ఇందుకోసం ప్రత్యేక చోరవ చూపిన పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్ గారికీ, ఆయన టీమ్ కు అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరణ చేపట్టిన అనేక మూతపడ్డ పరిశ్రమల్లో సిర్పూర్ మిల్లు ఒకటి’ అని ట్వీట్ చేశారు.

నిజాం కాలంలో 1938లో సిర్పూర్ పేపర్ మిల్లును స్థాపించారు. 1950లో బిర్లాగ్రూప్ దీన్ని టేకోవర్ చేసింది. అప్పటినుంచి నిరాటంకంగా ఉత్పత్తి కొనసాగింది. కొత్త యంత్రాల కొనుగోలు పేరుతో యాజమాన్యం 2007-08 మధ్యకాలంలో మిల్లును ఐడీబీఐకు తాకట్టు పెట్టింది. అయితే నష్టాలు పెరిగిపోవడంతో 2014 సెప్టెంబర్ 27న సంస్థ మూతపడింది.

అప్పటికే 3,200 మంది కార్మికులు పేపర్ మిల్లుపై ఆధారపడి బతుకుతున్నారు. 2016 అక్టోబర్ 22న ఈ మిల్లును ఐడీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మిల్లును తెరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిల్లును టేకోవర్ చేసే కంపెనీలకు రాయితీలు ఇస్తామని 2016 సెప్టెంబర్‌లో ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News