Tamilnadu: పెళ్లి నిశ్చయమైన 25 ఏళ్ల యువతిని అత్యాచారం చేసి, హత్య చేసిన 15 ఏళ్ల బాలుడు!

  • ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తూ ఉన్న ఒంటరి యువతి
  • పావురం తెచ్చుకునేందుకు వెళ్లి అత్యాచారం
  • బాలనేరస్తుల కారాగారానికి నిందితుడు

15 సంవత్సరాల వయసున్న ఓ బాలుడు, వచ్చే నెల 27న వివాహం నిశ్చయమైన 25 ఏళ్ల యువతిపై అత్యాచారం చేయడంతో పాటు ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన పుదుచ్చేరిలో తీవ్ర కలకలం రేపుతోంది. ఉరుళయన్ పేట పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఓ బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగినిగా ఉన్న యువతి, ఒంటరిగా నివసిస్తుండగా, ఆమెకు ఇటీవలే వివాహం నిశ్చయమైంది.

ఈ నెల 18న ఆ ఇంటి నుంచి మూలుగుల శబ్దం వినిపించగా, పక్కింటి వారు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో, మెడపై గాయాలతో పడివున్న సదరు యువతి కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం చేయించగా, ఆమెపై అత్యాచారం జరిగిందని తేలింది. దీంతో హత్య కేసుగా నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

ఈ క్రమంలో యువతి ఇంటి సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో ఇద్దరు యువకులు కనిపించడంతో, వారిని అరెస్ట్ చేసి, విచారించగా, ఘటనతో వారికి సంబంధం లేదని తేలింది. ఆపై అనుమానంతో పక్కింటి బాలుడిని ప్రశ్నించగా, అనుమానాస్పద సమాధానాలు చెప్పాడు. దీంతో తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం కక్కాడు.  

ఆ బాలుడు ఓ పావురాన్ని పెంచుకుంటుండగా, 18వ తేదీన అది ఎగురుకుంటూ పక్కింట్లోకి వెళ్లింది. దాన్ని తెచ్చుకునేందుకు ఒక్క ఉదుటున ఆ ఇంట్లోకి వెళ్లిన బాలుడిని, ఎందుకు వచ్చావంటూ ఆ యువతి కొట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన బాలుడు, బయటి నుంచి బండరాయి తెచ్చి, యువతి తలపై మోదాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోగా, ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఆపై గొంతుకోసి వెళ్లిపోయాడు. ఈ కేసులో బాలుడిని అరెస్ట్ చేసి బాలనేరస్తుల కారాగారానికి తరలించామని పోలీసు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News