Chandrababu: చంద్రబాబు చెప్పిన మాటలే నేనూ అంటున్నా... సమాధానముందా?: రోజా

  • పార్టీలు మారిన నేతలను చిత్తుగా ఓడించండన్న చంద్రబాబు
  • పత్రికల్లో క్లిప్పింగ్స్ చూపిస్తూ మీడియాతో మాట్లాడిన నేత
  • ఏపీలోనూ అదే సూత్రం పాటించాలా? రోజా ప్రశ్న

"పార్టీలు మారిన నేతలను చిత్తుగా ఓడించండి" అని తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు పలు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితం కాగా, వాటిని చూపిస్తూ మీడియాతో మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా, చంద్రబాబుపై సెటైర్లు వేశారు. చంద్రబాబు చెప్పిన మాటలనే తానూ చెబుతున్నానని, ఇదే పద్ధతిని ఏపీలో కూడా పాటించాలని చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన వారిని దుర్మార్గంగా టీడీపీలోకి లాక్కుంది చంద్రబాబు కాదా? అని ఆమె విమర్శల వర్షం కురిపించారు. తన రాష్ట్రంలో ఓ న్యాయం, పక్క రాష్ట్రంలో మరో న్యాయం కావాలనడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందని ఎద్దేవా చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి చంద్రబాబు కొనుగోలు చేశారని, వారిని కూడా చిత్తు చిత్తుగా ఓడించాలా? అని అడిగారు. తన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News