TRS: సూట్‌కేసులు అందడం లేదనే నీ కడుపు తరుక్కుపోతోందా?: సోనియాను ప్రశ్నించిన కేసీఆర్

  • కాంగ్రెస్ దద్దమ్మలు రాస్తే సోనియా చదువుతారు
  • సోనియా గుండె ఎందుకు తల్లడిల్లుతోందో
  • రాహుల్ ఆమాట చెప్పాకే తెలంగాణలో అడుగుపెట్టాలి

యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు రోజుల క్రితం మేడ్చల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణను చూస్తుంటే తన గుండె తల్లడిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా వ్యాఖ్యలపై తాజాగా కేసీఆర్ స్పందించారు.

ఆదివారం దేవరకద్రలో నిర్వహించిన సభలో మాట్లాడిన కేసీఆర్.. సోనియా గుండె ఎందుకు తరుక్కుపోతోందని ప్రశ్నించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అందిన మామూళ్ల సూట్‌కేసులు ఇప్పుడు అందడం లేదనా? లేక తెలంగాణలో రైతులు, చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు తగ్గినందుకు తరుక్కుపోతోందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ దద్దమ్మలు రాసిచ్చిన స్క్రిప్టును సోనియా చదువుతున్నారని అన్నారు. సోనియా గాంధీ ఎందుకు తల్లడిల్లుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వాలు చేయని ఎన్నో మంచి పనులను తాము ఈ నాలుగున్నరేళ్లలో చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, వారి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. తనను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును ఇస్తానని హామీ ఇచ్చారు.  తెలంగాణ గడ్డపై అడుగుపెట్టేందుకు వస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పరిశ్రమలకూ రాయితీ ఇస్తామని చెప్పి అప్పుడు ఈ గడ్డపై అడుగుపెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News