Vizag: కారుపై ఉమ్మేశాడని... చితక్కొట్టిన వైజాగ్ పోలీస్, అతని భార్య!

  • విశాఖ, ఎన్డీఏ జంక్షన్ లో ఘటన
  • బైకు, తాళాలు లాక్కెళ్లారన్న బాధితుడు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

తన కారుపై ఉమ్మేశాడనే కారణంతో ఓ వ్యక్తిని వైజాగ్ కు చెందిన ఓ పోలీసు, అతని కుటుంబ సభ్యులు చావ గొట్టిన ఘటన విశాఖ, ఎన్డీఏ జంక్షన్ లో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన కంచరపాలెం పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, బర్మా క్యాంప్‌ ప్రాంతానికి చెందిన పొలమరశెట్టి మాధవరావు, గత రాత్రి కంచరపాలెంలో ఉన్న తన దుకాణాన్ని మూసుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

సీఐఎస్‌ఎఫ్‌ క్వార్టర్స్‌ వద్ద రోడ్డుపై పార్కింగ్‌ చేసిన తన కారుపై అతను ఉమ్మి వేశాడని ఆరోపిస్తూ, శ్రీనివాసరావు అనే పోలీసు ఉద్యోగి, అతని భార్య, ఇతర కుటుంబీకులు దారుణంగా కొట్టారు. మాధవరావును తాళ్లతో కట్టేసి, తమ జులుం ప్రదర్శించారు. దాదాపు గంటా పదిహేను నిమిషాల పాటు వారి దాష్టీకం కొనసాగింది. ఈలోగా విషయం తెలుసుకున్న కంచరపాలెం పోలీసులు, ఘటనా స్థలానికి వచ్చి మాధవరావును విడిపించారు. ఇదే ఘటనలో తన పర్సు, షాపు తాళాలు, బైకును శ్రీనివాసరావు తీసుకున్నాడని మాధవరావు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News