Jayashankar Bhupalpally District: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నేలబావిలో పడ్డ మందుబాబు!

  • చీకట్లో దారికనిపించక బావిలో పడిన నిందితుడు
  • స్వల్ప గాయాలు 
  • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఘటన

మందుకొట్టి గొడవ పడి, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పరుగందుకుని ఓ బావిలో పడ్డ మందుబాబు కథ ఇది. ఈ సంఘటన తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరకాలలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం మేరకు... జిల్లాలోని రేగొండ మండలానికి చెందిన కొందరు పరకాలలోని ఓ బార్‌లో బుధవారం రాత్రి మద్యం సేవిస్తూ గొడవ పడడంతో పోలీసులకు సమాచారం అందింది. రేగొండ మండలం దామరంచపల్లికి చెందిన కూనూరు తిరుపతి,  బాగిర్థిపేట గ్రామానికి చెందిన శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ జీపులో కూర్చోబెట్టి మిగిలిన వారి కోసం వెతుకుతున్నారు. ఈలోగా జీపులో కూర్చున్న తిరుపతికి పోలీసులు కొడతారన్న భయం పట్టుకుంది. వెంటనే జీపు దిగి చీకట్లో పరుగందుకున్నాడు.

చీకట్లో ఏమీ కనిపించకున్నా భయాందోళనలతో పరుగందుకున్న తిరుపతి ఆర్టీసీ డిపో ప్రహరీ కార్యాలయం పక్కనే ఉన్న నేలబావిలో పడిపోయాడు. అయితే ఈత రావడం, బావిలో మోటారుకు సంబంధించిన తాడు ఉండడంతో దాన్ని పట్టుకుని దాదాపు 20 నిమిషాలపాటు ఉన్నాడు. ఈలోగా తిరుపతిని వెతుక్కుంటూ వచ్చిన పోలీసులు నేలబావిలో పడివుండడం చూసి మరో తాడందించి పైకిలాగారు. ఈ ప్రమాదంలో తిరుపతికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News