jana sena: ‘జనసేన’ కు పవన్ తల్లి అంజనాదేవి విరాళం

  • ‘జనసేన’ కార్యాలయానికి వెళ్లిన అంజనాదేవి
  • మాతృమూర్తిని సాదరంగా ఆహ్వానించిన పవన్ కల్యాణ్
  • రూ.4 లక్షల విరాళపు చెక్కు పవన్ కు ఇచ్చిన తల్లి

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తల్లి కొణెదల అంజనాదేవి ఆ పార్టీకి నాలుగు లక్షల రూపాయల విరాళం అందజేశారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి ఈరోజు ఆమె వెళ్లారు. పవన్ కల్యాణ్ కు ఈ చెక్కును ఆమె అందజేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన జనసేన పార్టీ ప్రతినిధులతో ఆమె మాట్లాడారు. పోలీస్ ఉద్యోగం ఎంతో శ్రమ, బాధ్యతతో కూడుకున్నదని అంటువంటివారి కుటుంబాలకు అండగా నిలవాలని కుమారుడు పవన్ కళ్యాణ్ ను అడిగినట్లు చెప్పారు.ఎందుకంటే, పోలీస్ ఉద్యోగం గురించి తనకు బాగా తెలుసని, తన తాత గారు బ్రిటిష్ హయాంలో పోలీస్ కానిస్టేబుల్ గా పని చేశారని, తన తండ్రి ఎక్సయిజ్ శాఖలో సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా పశ్చిమగోదావరి జిల్లాలో పని చేసేవారిని గుర్తుచేసుకున్నారు. ఎక్సయిజ్ శాఖలోనే కానిస్టేబుల్ గా పని చేసిన కొణెదల వెంకట్రావుతో తనకు వివాహమైందని, ఆ శాఖలో అనేక పదోన్నతలు పొంది అసిస్టెంట్ సూపరింటెండెంట్ స్థాయిలో రిటైర్ అయిన విషయాన్ని ప్రస్తావించారు.

తన భర్త వెంకట్రావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినందువల్లే ఇప్పటికి తనకు పెన్షన్ వస్తోందని, ఆ పెన్షన్ డబ్బుతోనే ఇప్పుడు జనసేన పార్టీ కి నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని అందచేశానంటూ ఆనందం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా నాకు పెన్షన్ విలువ తెలుసు
 
పార్టీ కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన తన మాతృమూర్తికి పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించిన పవన్ కల్యాణ్, ఆమె పాదాలకు నమస్కరించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ‘ప్రభుత్వోద్యోగి కొడుకుగా నాకు పెన్షన్ విలువ తెలుసు. అందుకే ప్రభుత్వోద్యోగులు సి.పి.ఎస్. విధానం రద్దు కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నాను. వారికి న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తాను’ అని అన్నారు.
 
నాడు నాదెండ్ల ఉత్తర్వులతో మా కుటుంబానికి మేలు జరిగింది

అంజనాదేవికి జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ నమస్కరించారు. నాడు నాదెండ్ల భాస్కర రావు ఉత్తర్వుల కారణంగా తమ కుటుంబానికి కలిగిన మేలును ఆమె గుర్తుచేసుకున్నారు. నాడు సీఎంగా ఉన్న ఎన్టీఆర్..  ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 55 సంవత్సరాలకు తగ్గించారని,  నాదెండ్ల భాస్కర రావు ముఖ్యమంత్రి కాగానే ఆ వయో పరిమితిని 58 ఏళ్లకు పెంచిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. వయోపరిమితి పెంచడంతో తన భర్తకు మరో మూడేళ్ళ పాటు ప్రభుత్వానికి సేవలందించే అవకాశం నాడు లభించిందని, ఇది తమ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగించిన విషయమని అంజనాదేవి గుర్తుచేసుకున్నారు.

  • Loading...

More Telugu News