YSRCP: రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు: వైసీపీ నేతలు

  • రాజ్ నాథ్ తో భేటీ అయిన వైసీపీ నేతలు
  • జగన్ పై హత్యాయత్నం అంశాన్ని కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని వినతి
  • తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవాలంటూ విన్నపం

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో వైసీపీ నేతలు భేటీ అయ్యారు. తమ అధినేత జగన్ పై జరిగిన దాడి ఘటనపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని ఈ సందర్భంగా వారు కోరారు. తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవాలని కూడా విన్నవించారు. రాజ్ నాథ్ ను కలిసిన వారిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డిలు ఉన్నారు.

భేటీ అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ, జగన్ పై జరిగిన హత్యాయత్నం గురించి రాజ్ నాథ్ కు వివరించామని చెప్పారు. ఘటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలు వ్యవహరించిన తీరు గురించి తెలిపామని వెల్లడించారు. జగన్ కు తగినంత భద్రత కల్పించాలని చెప్పామని అన్నారు. ఆపరేషన్ గరుడ ఎవరు చేయిస్తున్నారో విచారించాలని విన్నవించామని చెప్పారు. తమ విన్నపాల పట్ల రాజ్ నాథ్ సానుకూలంగా స్పందించారని... జగన్ కేసును పరిశీలిస్తానని చెప్పారని తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News